మైండ్ నెట్ వర్క్..వేణుభగవాన్..ది సీక్రెట్

మైండ్ నెట్ వర్క్

ప్రతి మనిషీ  చివరి మజిలీ, అగుపించని అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది భ్రమపడుతుంటారు. నిజానికి, మనిషి మనసులో కలిగే ఆలోచనలని బట్టే అది సంభవమౌతుందని బహు కొద్దిమంది విజ్యులకే తెలుస్తుంది. .... హెచ్.డి.ధోర్యూ

సుమారు 1400 గ్రాములుతో బూడిద రంగు  తెల్లని కణజాలాలతో తయారై కపాలంలో ఉండే అంగాన్ని మస్తిష్కం లేదా మెదడు (brain) అంటున్నాము.ప్రపంచంలో కెల్లా అత్యంత క్లిష్ట మైన నిర్మాణం కలది మెదడు. ఇది 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది. శరీర బరువులో 2 శాతమే ఉన్నా, 20 శాతం ఇంధనాన్ని తీసుకుంటుంది.

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం మెదడు. జ్ఞాపక శక్తి, వ్యక్తిత్వం, ఆదేశాలను గ్రహించి తిరిగి ఆదేశాలను ఇవ్వటం. ఇవన్నీ మస్తిష్కం ద్వారానే శాసించబడతాయి. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త వ్యవస్థ, నాడీ వ్యవస్థ మొదలగు వాటన్నిటికీ కేంద్రం మెదడు. రకరకాల భావాలు, ఆలోచనలు మొదలగునవి దీని పరిధిలోనికి వస్తాయి. నాడీ కణజాలాల .ద్వారా ఒకదానితో ఒకటి చక్కగా కలసి ఉండడం వలన ఇందులో ఒక భాగానికి ఏదైనా అయితే మిగిలిన శరీర భాగాలన్నిటికీ కూడా వెంటనే తెలిసిపోతుంది. జ్ఞానేంద్రియాలతో బాటు కండరాల పనులన్నీ మెదడు పరిధిలోకి వస్తాయి. వెన్నెముక - చిన్న మెదడుల మధ్య ఉండే మజ్జాముఖము ( మెడుల్లా అబ్లాంగేట ) ద్వారా శరీరానికి ఆదేశాలను పంపటం, అందుకోవటం జరుగుతుంది.మన మెదడులో సుమారు పది వేల కోట్ల కణాలు ఉంటాయట. ప్రతి కణమూ మరో ఇరవై వేల కణాలకు కలవబడి ఉంటుందట. యిలా లెక్కవేసుకుంటూ పొతే ప్రపంచంలో ఉన్న కణాలకన్నా మనిషి మెదడులోనే ఎక్కువ కణాలు ఉంటాయట. నిజానికి మెదడుకు సంబంధించి అసలు రహస్యమేమి లేదు.దీని గురించి ఎన్నో గ్రంధాలలోనూ వివరించబడింది. కాకపొతే వాటిని చదివి విని అంతకన్నా ముఖ్యంగా  అర్ధం చేసుకునే ఓపిక ప్రస్తుతం ఎవరికీ ఉంది.

ఇవన్నీ వైద్య శాస్త్రంలో చెప్పబడిన విషయాలే! వాటిని గురించి మన ఋషులు, మునులు కూడా లోతుగా పరిశీలించి పరిశోధనలు చేసి మెదడును గురించే కాక మనసును గురించి కూడా వివరించి  చెప్పారు.

మనసు - ఇంద్రియాలు

మనసులో పుట్టిన ఆలోచనలు మెదడులోకి ఆమోదముద్ర కోసం వెళ్తాయి. బుడ్డి ఆమోదం పొందిన తరువాత, మనస్సు సందేశాలను ఇంద్రియాలకు జారీ చేస్తుంది. ఇంద్రియాలు శరీరంలోని ఆవశ్యక అంగాలకు ఈ ఆదేశాలను క్రియా రూపంలో పెట్టడం కోసం అందిస్తాయి. ఇంద్రియాలు ఈ పనులు ఎలా చేస్తున్నాయో  అన్న విషయాన్ని పరిశీలిద్దాం.

వస్తువుని చూసి కళ్ళు దాని రూపాన్ని మనసుకు అందిస్తాయి. మనస్సు బుద్ధి ఆమోదాన్ని పొంది కాళ్ళను ఆ వస్తువు వద్దకు పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. స్పర్శ ద్వారా ఆ వస్తువు యొక్క గుణాలను తెలుసు కోమని  చేతులకు ఆజ్ఞలను జారీ చేస్తుంది.చప్పరించి రుచిని తెలుసుకోమనే ఆజ్ఞలను నాలుకకు ఇస్తుంది. చెవులకు శబ్దాల ద్వారా ఆ వస్తువు యొక్క గుణాలను గ్రహించమని చెప్తుంది. ఈ విధంగా  ఒక వస్తువు యొక్క గుణాలను తెలుసుకోవటంలో ఇంద్రియాలన్నిటి సహాయము లభిస్తుంది. ఇదెంత సమర్ధవంతంగా అతి తక్కువ వ్యవధిలో జరుగుతుందో మనం ఊహించలేము.

అయితే మన ఇంద్రియాలు చెప్పే విషయాలను మనం తెలుసుకోవడం  లేదు. ఉదా:మన కళ్ళు చూసిన విషయాన్ని మెదడుకు పంపిస్తుంది. మెదడు వాటిని తన అనుభవాలతో విశ్లేషించి చూస్తుంది. ఆంటే మనం కళ్ళతో చూడట్లేదు. మెదడుతో చూస్తున్నాం. అలాగే వినడమైనా, రుచైనా, వాసనైనా, స్పర్శ అయినా మెదడులో ఉన్న ప్రోగ్రాం ప్రకారమే జరుగుతుంది.

మనస్సు (Mind)

మెదడును చూడగలం. మనస్సును చూడలేము. మనస్సు ఆంటే (మైండ్) ఒక ఆలోచనా తరంగాల ప్రవాహం. దీనికి ఒక రూపం లేదు. మెదడు స్థూలమైతే మనస్సు సూక్ష్మమైనది. ఆకారం కలిగిన మెదడును కోసి చూడగలం, కానీ మనస్సును చూడలేము. ఎక్కడైతే భావాలు ఎగసి పడతాయో, అది మనస్సు  అని మనం గుర్తించాలి. అనుభూతులను అన్భావించి వాటిని శరీరంలోని వివిధ అవయవాలకు నాడుల ద్వారా పంపించటం దీని పని. మెదడు పడుకున్నప్పటికీ మన మనస్సుకు విశ్రాంతి ఎక్కడా? నిత్యం ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది.

యోగ శాస్త్రంలో మనస్సుకు మూడు భాగాలుంటాయి అని గుర్తించారు, అవి చైతన్యము, అర్ధచైతన్యము, ఆచైతన్యము. మనస్సు ఎంత సూక్ష్మమైనది ఆంటే దీని పొడవు వెడల్పుని మనం కొలవలేం. సూక్ష్మ తరంగాలు కలయికతో తయారయిన పదార్ధంగా చెప్పవచ్చు. ఎటువంటి ఆగోచరమైన వస్తువును కూడా మనః చక్షువులతో చూడగలం, స్వప్నాలన్నవి మనస్సు ఆడే ఆటలే.

అతి చిన్నదాని నుండి అతి పెద్ద ఆకారం వరకూ స్వీకరించగల సమర్ధత మనస్సుకు మాత్రమే ఉంది. శరీరం బయటా లోపలా కూడా సంచరించగలిగేది మనస్సు మాత్రమే. మనస్సుకు మూడు రకాల పద్దతులు ఉన్నాయి. అవి కోరిక, ఆలోచన, క్రియ. ఎప్పటికప్పుడు మార్పులు పొందుతూ ఉండడం దీని లక్షణం. మనస్సు చంచలమైనది కావటం వలన అందరికీ  ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. జాగృతావస్థలో మనస్సు బైట వస్తువుల ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. కలల్లో తనదైన ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది. మనస్సులొ వచ్చే భావనలు పక్షుల్లాంటివి. ఎక్కడైనా విహరించవచ్చు. భావ ప్రపంచంలో మనిషి సర్వస్వతంత్రుడు.

భావనలు మన మాటలను, చేష్టలను ప్రభావితం చేయగలవు. మనస్సు ఎంత శక్తివంతమైనదంటే మనకు కావల్సినదేదైనా సాధించిపెట్టగలదు. ఈ మనస్సు యొక్క కొద్దిపాటి శక్తిని కూడా ఎప్పుడూ వినియోగించడం లేదు. ఏ పని లేనప్పుడు చంచలంగా ఉండే మనస్సు, ఒక లక్ష్యం ఉన్నవారికి ఇది అందించే సేవలు అమోఘం.

మనస్సుని అదుపులోనికి తెచ్చుకోవడం

స్వామీ వివేకానంద ఒక సందర్బంలో "ముక్తి మనస్సుని క్షణమాత్రం అదుపులో ఉంచుకోలేని, ఒక అంశంపై మనస్సు నిలపలేని, సమస్తాన్ని వర్ణించి కేవలం ఒక్క అంశం మీద క్షణం సేపు కేంద్రీకరింప  లేనివారం  మనం. అయినా విముక్తులం క్రింద జమకట్టుకొంటాం. ఈ విషయం కాస్త యోచిచండి" అన్నారు.

శ్రీ రవిశంకర్ చెప్పినట్లు మనస్సు చాలా నిరాధారమైనట్టిది . మరియు ఊహాతీతమైనట్టిది దానిని మీరోకచోట కట్టివేయలేరు. మనస్సుకు శరీరానికీ లంకె వేసేదోకటి ఉంది. అదే మన శ్వాస.

పుట్టగానే మనం చేసిన మొట్టమొదట పని ఏడవడం కాదు. శ్వాస పీల్చుకోవడం. జీవితంలో చివరి కృత్యమేది? శ్వాస వదిలివేయడం. జీవితంలో మొదటి చర్య మరియు ఆఖరి చర్యల మధ్య కాలంలో ఆంటే యావజ్జీవితంలో అనుక్షణం స్వాసలోనికి పీల్చుకుని బయటకు వదులుతుంటాము.

శ్వాసలకీ మనస్సుకీ ఉన్న సంబంధం ఎలాటిదంటే గాలికి, అగ్నికి ఉన్న సబంధం. గాలి పెరిగితే అగ్ని పెరుగుతుంది. అదే విధముగా శ్వాసలు పెరిగితే మనసు చంచలం అవుతుంది.గాలి నిలకడగా ఉంటే అగ్ని నిలకడగా ఉంటుంది. అదే విధంగా శ్వాసలు స్థిరంగా ఉంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. నిముషానికి 15 శ్వాసలకంటే తక్కువ తీసుకోగలిగినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. 18 కన్నా ఎక్కువయితే మనసు అలజడిగా ఉంటుంది. మనసు అలజడిగా ఉంటే ఇంద్రియాలు అదుపుతప్పుతాయి. కోపం చిరాకు, అశాంతి లాంటివి వస్తాయి.

ముఖ్యంగా దీర్గ ప్రాణాయానం చేయడంవల్ల కాన్షస్ మైండ్ అదుపులోనికి వస్తుంది. సాదారణంగా మనం పీల్చుకునే శ్వాసల సంఖ్య నిముషానికి 18 నుండి 25 వరకూ ఉంటాయి. ప్రాణాయామం వల్ల 10 నుండి 15 కు తగ్గుతాయి. ఓంకారం, గాయిత్రి మంత్రం లాంటివి పాటించడం వల్ల కూడా ప్రాణాయామం జరిగి,శ్వాసల సంఖ్య తగ్గుతుంది.

ఈ సత్యాన్ని గ్రహించిన మన యోగులు మనస్సును అరికట్టాలంటే శ్వాసలను అరికడితే సరిపోతుందని చెప్పారు. గౌతమ బుద్దుడు కూడా శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సును, ఆలోచనలనూ స్వాధీనం చేసుకోవచ్చునని "ఆనాపానసతి" అనే ధ్యాన క్రియను కనుకొన్నాడు.

ఒక ఆవును కట్టివేయడానికి ఒక తాడు చాలు, కానీ 30 వేల ఆవులను కట్టడానికి ఎన్ని తాళ్ళు కావాలి. అందుకే మన మనస్సును నియంత్రించలేము అని, కేవలం మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నించడమే మనం చేయకలిగింది అనుకుంటారు. కోతిలాంటి మన మనస్సును 'ప్రానాయామా' అనే తాడుతో సులభంగా కట్టేయవచ్చు.

"తన మనసును తానూ నిగ్రహించే వ్యక్తికి ఇతరుల మనసులను నిగ్రహించే శక్తి ఉంటుంది. పరిశుద్దుడు, నీతిమంతుడైన వ్యక్తి తనను తానూ నియంత్రించుకోగాలుగుతాడు. పైగా అందరి మనసులు ఒక్కటే. ఒకే మహాత్ తత్వపు భిన్నభావాలు. ఒక మట్టి ముద్దను తెలుసుకుంటే, ప్రపంచంలోని మట్టినంతా తెలుసుకునట్లే, తన మనసును ఎరిగి, నిగ్రహించుకోవటం చేతనైన వ్యక్తికి, ఇతరుల మనసుల రహస్యాలు తెలుస్తాయి. అతనికి మిగతా వారి మనసుల మీద సాధికారాకత ఏర్పడుతుంది."...స్వామీ వివేకానందా

భావోద్వేగాలు


"తన ఇంద్రియాలని అదుపులో ఉంచుకోగలిగిన వాడి బుద్ధి స్థిరంగా  ఉంటుంది. అతడిని మించిన విద్వాంసుడు, పండితుడు ఇంకెవరుంటారు?"...శ్రీకృష్ణ భగవానుడు

మన  భావోద్వేగాలు ఏ మేరకు అదుపులో ఉంటాయో, ఆ మేరకు ఒక వ్యక్తి వ్యదిత్వం ఆరోగ్యంగా ఉంటుంది. మనం మనుషులను ఆకర్షించే భావోద్వేగాలను ఉపయోగించాలి. వికర్షించే భావోద్వేగాలను అవసరమైనప్పుడు మాత్రమే ప్రదర్శించాలి.


ఆకర్షించే భావోద్వేగాలు :ప్రేమ, మెచ్చుకోలు, అభిలాష, సానుభూతి, ఆదరణ, ఆనందం, అభిమానం, విశ్వాసం, నమ్మకం, ఉత్సాహం, లాంటివి ఆకర్షిస్తాయి. ద్వేషం, క్రోధం, భయం, విచారం,అసూయ, అత్యాశ, పగ, చిరాకు, అవమానం మొదలైనవి వికర్షిస్తాయి. అయితే ఎప్పుడు ఏ భావాన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకుని భావాలను తన అదుపులో ఉంచినవారి వ్యక్తిత్వం వికసించి ఉన్నతంగా రూపుదిద్దుకుంటుంది. ఏది అతి కాకూడదని గుర్తు పెట్టుకోవాలి. మంచి భావాలు కూడా అతి అయితే సృతిమించుతుంది. ఉదాహరణకు ప్రేమ భావం మంచిదే కానీ ఎవరి మీదైనా అతి ప్రేమ పెరిగిపోతే అది అవతలి వారిపాలిట బంధం అవుతుంది. మీ నుండి పారిపోవాలనుకుంటారు. అదుపులేని మంచి భావం, చెడు భావం కన్నా చెడు చేస్తుంది. అలాడే అప్పుడప్పుడు కోపం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ రకంగా భావాలను మనం వాడుకోవాలి, ఎన్నడూ భావాల చేతిలోకి మనం వెళ్ళకూడదు.

జీవకళ

కొంతమంది ముఖంలో తెలియని కళ కనపడుతూ ఉంటుంది. వారిని చూడగానే మంచి అభిప్రాయం కలుగుతుంది. అందుకే కదా పెద్దలు అన్నారు. ముఖం మనస్సును ప్రతిబింబిస్తుందని. ఉన్నత విలువలు కలవారిలో ఈ ఆకర్షణ ఎక్కువ కనపడుతుంది.

మన శరీరం చుట్టూ కంటికి కనపడని శక్తివలయం ఉంటుంది. ఏనాడో మన యోగ శాస్త్రంలో చెప్పబడిన ఈ శక్తివలయము గురించి రష్యాలో కొంతమంది శాస్త్రజ్ఞులు దీనిని కిర్లాన్ ఫోటోగ్రఫి అనే పద్దతిలో ఫోటో తీయడం ద్వారా నిరూపించారు, 'కిర్లాన్ ' అనే ఒక రష్యన్ శాస్త్రజ్ఞుడు ఈ జీవకాంతిని ఫోటో తీసే కెమెరాను కనుకొన్నాడు. ఈ శక్తి శరీరం లోపల, బయట కొన్ని మార్గాలలో ప్రయాణిస్తూ ఉంటుంది. యోగ శాస్త్రంలో ఈ మార్గాలను నాడులని అంటారు. ఈ దారులు మూసుకుపోయినపుడు లేదా ఎక్కువ శక్తి ఒకే చోట కేంద్రీకృతమైనపుడు కొన్ని రకాలైన మానసిక, శారీరక రుగ్మతలు ఏర్పడతాయని నిరూపించబడింది. యోగాసనాలు వేయడం ద్వారా ప్రాణశక్తి ఈ నాడుల ద్వారా అడ్డంకులు లేకుండా, సులువుగా ప్రవహించడం వలన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మన మనసులోని భావాలను చాలా వరకూ శరీరం ప్రతిఫలింపచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం కోపంగా ఉన్నప్పుడు చాతినీ, బుజాలనూ ఎగరవేస్తాం. బాధగా ఉన్నప్పుడు నిట్టూరుస్తాం. ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసను వేగంగా తీసుకుంటాము. అదే సంతోషంగా ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉన్నట్లు ఉంటుంది. ఈ విధముగా మన మనస్సుని శరీరం ప్రభావితం చేస్తుంది. యోగా, ప్రాణాయామ మనసుని, శరీరాన్నీ శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసి మనసునీ, శరీరాన్నీ అందంగా తీర్చిదిద్దుతాయి.

ఈ జీవకాంతి నిండుగా కలవారు భావోద్వేగాల మీద అదుపు కలిగి ఉంటారు. వీరిని ఎప్పుడూ మాటలతో గాయపచలేరు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కారులా ఈ శక్తివలయం వీరి మనస్సును దృడంగా ఉంచుతుంది. మీరు గమనించే ఉంటారు. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, ఎవరైనా జోక్ చేసినా సరదాగా తీసుకుంటారు. అదే చిరాగ్గా ఉన్నప్పుడు అదే మాటకు కోపం వచ్చేస్తుంది.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!