భారతంలో ఒక కథ- "శిఖండి"

కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు. అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకుని ఆ  స్వయంవరానికి విచ్చేసాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి. అపుడు భీష్ముడు అందరిని ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్లి  ఏర్పాట్లు  చేయమన్నాడు.
అపుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి "గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. అతనే నా ప్రాణనాయకుడు. మనసు లేని మనువు క్షేమం కాదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు, నా చెల్లెల్లిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లిచేయ్యి" అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబని సాళ్వదేశానికి పంపాడు .

సాళ్వుడు  అంబని  చేసుకోడానికి నిరాకరించాడు. "నువ్వంటే ఇష్టం ఉన్న, వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను" అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు. తిరిగి హస్తిన కొచ్చిన  అంబని భీష్ముడు కూడా  నిరాకరించాడు. అపుడు అంబ నీ వలననే నా ఆశలన్ని  నేలరాలాయి. నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది. "అంబా! నువ్వు ఏనాడూ ఐతే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అపుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను" అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు .
తన కూతురిబిడ్డ  ఐన అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు. తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి "అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు". ఇదే నీకు చేయగల సహాయం అని చెప్పాడు. ఆ వరమాల ధరించే వారికోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని  చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకుంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనక పోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి,  ఆత్మాహుతి చేసుకుంది.

ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా అంబ జన్మించింది. అంబ అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది. అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో "భీష్ముడితో వైరమా!" అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళకొట్టాడు.

అంబ తన ప్రతిజ్ఞ నేరవేరడంకోసం శివుడికోసం తపస్సుచేసి పురుషుడిగా మారింది. ఆ అంబనే "శిఖండి".
మహాభారత యుద్దంలో అర్జునుడిరథం ముందుభాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు. అదను చూసి అర్జునుడు భీష్ముడిని  హతమార్చాడు. ఆ విధంగా అంబ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!