దూలదర్శన్-just for fun

కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము.

నాకు ఆ పొయ్యేకాలం గత వారం వచ్చింది.

మా ఆఫీసు లొ తెలుగు వాళ్ళము ఒక ఇరవై మంది దాకా ఉంటాము...వాళ్ళలో పట్టాభి ఒకడు. పొయిన వారం వాడి పుట్టిన రొజు. ఆఫీసు కాంటీను లో అందరికి జ్యూసు ఇప్పించాడు. ఎవరి కక్కుర్తి కొద్దీ వాళ్ళు బాగనే తాగారు. ఈ లోపు విద్యా అనే అమ్మాయి ఎదో చీటీల గేం మొదలు పెట్టింది.

ప్రతి ఒక్కరు టేబుల్ మీద ఉన్న చీటీలు తియ్యాలి. చీటీలొ ఏమి రాసుంటే ఆ పని చెయ్యలి (ఔను..మా దిక్కుమాలిన ఆఫీసులొ పుట్టిన రోజు పండగలకి ఇలాంటి ఆటలే ఆడుతారు).

మొదటి చీటీ విద్యానే తీసింది.."వరుసగా రెండు జ్యూసులు తాగాలి" అని చదివింది. నాకు అనుమానమే. చీటీలు రాసింది అది. లోపల ఏమున్నా, నొటికొచ్చింది చదివి, తేరగా రెండు జ్యుసులు తాగేసింది. ఆ తరువాత చాలా మంది చీటీలు తీసారు. 'పాట పాడాలి ', 'నాలుక తో ముక్కును తాకాలి ' లాంటి మెదడుకు పదును పెట్టే చేష్టలెన్నో చేసారు.

చివరగా పట్టాభి చీటీ తీసాడు. అందులో "నీకు ఇష్టమైన TV ప్రోగ్రాం గురించి చెప్పాలి" అని ఉంది.

వాడు "నా ఫేవరెట్ ప్రోగ్రాం 'ప్రగతి పథం'" అన్నాడు.

"ఏ ఛానెల్ లొ వస్తుంది?" ఎవరో అడిగారు.

"దూరదర్శన్ - తెలుగు" అన్నాడు పట్టాభి.

అంతే....అంత వరకు కోలాహలంగా ఉన్న ఆఫీసు కాంటీన్ ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారింది. ఒక్కొక్కరుగా కాంటీన్ నుంచి వెళ్ళిపొయ్యారు.

వెళ్ళేటప్పుడు ఎవ్వరూ పట్టాభి గాడిని విష్ కూడా చెయ్యలేదు.

చాలా బాధేసింది..పట్టాభి ని చూసి. చాల కోపమొచ్చింది..వెళ్ళిపోతున్న జనాలను చూసి.

పట్టాభి గాడు "నాకు AIDS ఉంది" అన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు కాదేమో.

అస్సలు వాడు చేసిన తప్పేంటో నాకు అర్థం కాలా. దూరదర్శన్ చూడటం అంత పెద్ద నేరమా?

వాడితొ ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాడితొ కలిసి భొజనం చెయ్యటం మానేసారు. ఇదివరకు వాడిపక్కన సీట్ ఉన్న వాళ్ళంతా ప్లేసు మార్చేసారు.

రెండు రోజుల తరువాత - బాగా బధ్ధకంగా ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టాను.

TV ఛానళ్ళు మారుస్తూ దూరదర్శన్ దగ్గర ఆగాను. పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం.

(నేను మొదట్లొ చెప్పినట్టు 'పొయ్యేకాలం' ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకే ఒక్క సూచన ఉంది 'పొయ్యేకాలం' రాకను పసిగట్ట టానికి - "దూరదర్శన్ చూడాలి" అనే ఆలొచన రావటం).

సరే.. ఎలాగూ ఛానెల్ మార్చను కదా అని, దూరదర్శన్ పెట్టి, రిమోట్ అవతల పారెసి...ఈసీ చైర్ లొ జారబడి కూర్చున్నా.

శాంతి స్వరూప్, విజయ దుర్గ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడో చూసాను వీళ్ళని. ఇద్దరూ బాగా లావయ్యారు..శాంతి స్వరూప్ లో ఎదో తేడా కనిపిస్తోంది. ఎంటబ్బా అని అలోచిస్తుండగా....శాంతి స్వరూప్ తన విగ్గు తీసి, బట్ట తల గోక్కొని, మళ్ళీ పెట్టుకున్నాడు. ఒహ్..ఇదా విషయం.

విజయ దుర్గ ఎదో ఉత్తరం చదువుతోంది.

గుర్తు పట్టెసా..ఇది 'జాబులు జవాబులు ' కార్యక్రమం!

కానీ వాళ్ళిద్దరి వెనకాల ఉన్న నీలం రంగు గుడ్డ మీద 'జాబు - జవాబు ' అని రాసుంది. పేరు మార్చారెమో అనుకున్న. ఒక అరగంట పాటు చూసాక అర్థమయ్యింది. ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది వాళ్ళకు - అది కూడా ఫిబ్రవరి నెలలొ దూరదర్శన్ కేంద్రం ఆఫీసుకు వచ్చిన కరెంటు బిల్లు. విజయ దుర్గ ఆ బిల్లులొ ఉన్న ప్రతి అక్షరం చదివి "చాలా మంచి సూచన్లిచ్చారండి" అంది. తరువాత శాంతి స్వరూప్ "కరెంటు" మీద ఒక కవిత చెప్పాడు.

అరగంట తరువాత జాబు జవాబు ముగిసింది. శాంతి స్వరూప్ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. విజయ దుర్గ ముందు టేబుల్ తెచ్చి వేసారు. కెమేరా వైపు చూసి "తరువాయి కార్యక్రమం..కొత్త సినిమా పాటలు" అని అనౌన్సు చెసింది.

ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.

ప్రోగ్రాం మొదలయ్యింది..

'ఈ పిల్లకు పెళ్ళవుతుందా', 'పులి బిడ్డ ', 'జగన్మోహిని ' - ఒక్కొక్క సినిమాలొంచి రెండు రెండు పాటలేసారు.

అప్పుడర్థమయ్యింది...'కొత్త సినిమ పాటలు ' అంటే - తెలుగు సినిమా మొదలయ్యిన కొత్తలో పాటలని.

మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...మళ్ళీ విజయ దుర్గ వచ్చింది. "ఇప్పుదు డిసెంబరు నెలలొ జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు" అంది.

ప్రోగ్రాం మొదలయ్యింది. అసెంబ్లీలో ఎవ్వరూ లేరు. నలుగురు ఆడవాళ్ళు కసువు ఊడుస్తున్నారు. ఒక అరగంటయ్యింది...వెరే ఎవరొ వచ్చి సీట్లన్నీ తుడిచి, వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళారు. తరువాత MLA లు ఒక్కరొక్కరుగా రావటం మొదలు పెట్టారు.

నాకేమి అర్థం కావటంలా...అసెంబ్లీ సమావెశాలంటే MLA లు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, వాళ్ళ దినచర్య అంతా చూపిస్తారా...

నాలొ కొద్దిగా భయం మొదలయ్యింది. దూరదర్శన్ ను ఎంత తక్కువగా అంచనా వేసానో ఇప్పుడు అర్థమయ్యింది.

టైము చూసాను....ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయ్యింది. ఇంకో పది నిముషాలలొ సమావెశాలు ముగిసిపొతాయి అనుకుంటుండగా విజయ దుర్గ మళ్ళీ వచ్చింది. "అనివార్య కారణాలవల్ల సమావెశాలు పూర్తిగా చూపించలేక పొయాము. ఈ రోజు రాత్రి యెనిమిదింటికి కార్యక్రమం మొదటి నుంచి మళ్ళీ ప్రసారం చేస్తాము" అంది.

అమ్మో... త్వరగా బయటపడాలి అని పైకి లేవబొయ్యాను...నా వల్ల కాలేదు. వీపు పట్టెసింది..అస్సలు కదలలేక పొయ్యాను. సరే ఛానెల్ మారుద్దాం అని రిమోట్ కోసం చూసాను.

"దరిద్రుడు బాత్రూము లోకి పోతే... శనిగాడు బయట నుంచి గొళ్ళెం పెట్టేసాడంట"

ఇందాక వెరే ఛానెల్ ఎదీ చూడను అన్న ఆవేశం లొ రిమోట్ ఎక్కడో పారెసాను. ఇప్పుడు అది దొరకట్లేదు. కుర్చీలోంచి లేవటానికి విశ్వప్రయత్నం చేసాను..లాభం లేదు.

చెసేదేమీ లేక అలా ఆ క్షోభను అనుభవిస్తూ కూర్చున్నాను...

నేను చిన్నప్పుడు చదువుకున్నాను - "1926 లొ జె.ఎల్.బైర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు" అని. మహానుభావుడు ఎక్కడున్నడో....భవిష్యత్తు లొ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారమౌతాయి అని తెలిసుంటే TV ని పురిట్లొనే చంపేసేవాడు.

వార్తలు మొదలయ్యాయి. నేనెలాగూ నాశనం అయ్యాను...కనీసం మిగతా ప్రపంచమన్నా బగుందో లెదో తెలుసుకుందాం....

శాంతి స్వరూప్ - "నమస్కారం...ఈ రోజు వార్తల్లోని ముఖ్యంశాలు చదివేముందు....'వార్త ' అనే మాట మీద చిన్ని కవిత"

పది నిముషాల పాటు కవితలు, చాటువుల తరువాత వార్తలు అయిపొయ్యయి.

దుర్గమ్మ తల్లి మళ్ళీ వచ్చి "తరువాయి కార్యక్రమం...డాక్టర్ సలహాలు...live program...మీరు డైల్ చెయ్యవలసిన నెంబరు - 040 23454261. ఈ రోజు అంశం....మూత్ర సంబంధిత వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు"

శాంతి స్వరూప్ తయారయ్యాడు.

శాంతి స్వరూప్ - "ప్రేక్షకులకు నమస్కారం..మా డాక్టర్ గారు ఇంకా రాలేదు. మీరు ఈలోపు ఫొన్ చెస్తే..నా తొ మాట్లాడొచ్చు"

ఇంతలొ ఫొన్ మోగింది..

వీళ్ళకు ప్రేక్షకులు ఫొన్ చేసి చాల కాలమైంది అనుకుంటా...ఫొన్ మోగంగానె స్టూడియో లొ ఉన్న అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒక చిచ్చు బుడ్డి కూడా కాల్చారు.

శాంతి స్వరూప్ ఫొన్ తీసుకుని - "హలో"

కాలర్ - నమస్కారం సార్...నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాను.

శాంతి స్వరూప్ - శ్రీనివాస్ గారూ...మీ TV వాల్యూం కాస్త తగ్గించుకొవాలి

కాలర్ - లేదు సార్...మా ఇంట్లో ఎవ్వరూ దూరదర్షన్ చూడరు. మీరు భయపడకండి.

శాంతి స్వరూప్ - సరే చెప్పండి

కాలర్ - నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్ కు చూపించాను సార్

శాంతి స్వరూప్ - అలాగా...మరి డాక్టర్ ఏమన్నాడు

కాలర్ - జ్వరమొచ్చిందన్నాడు

శాంతి స్వరూప్ - మరి ఇంకేంటి సమస్య...శ్రీనివాస్ గారు, మన స్టూడియో కు డాక్టార్ గారు రావటానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఈలోపు నెనొక కవిత చదువుతాను....వినాలి తమరు.

నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....

దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!